కొడాలి నానిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన దేవినేని ఉమ

  • తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు
  • లారీతో తొక్కి చంపుతామని బెదిరించారని ఆరోపణ
  • ఒక మంత్రి ఇలా మాట్లాడటం ఏమిటని మండిపాటు
ఏపీ మంత్రి కొడాలి నానిపై తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో టీడీపీ నేత దేవినేని ఉమ ఫిర్యాదు చేశారు. లారీతో తొక్కించి చంపుతామని తమను బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కొడాలి నానితో పాటు వల్లభనేని వంశీ, వసంత కృష్ణప్రసాద్ లపై కూడా ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా మీడియాతో దేవినేని ఉమ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్ ప్రేరణతోనే నాని, వంశీ, కృష్ణప్రసాద్ బెదిరిస్తున్నారని అన్నారు. లారీతో తొక్కిస్తానని ఒక మంత్రి అనడం ఏమిటని మండిపడ్డారు. ఇలాంటి మాటలు రాజ్యాంగ ఉల్లంఘన కిందకు రావా? అని ప్రశ్నించారు. కొడాలి నానిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మరో టీడీపీ నేత బచ్చుల అర్జునుడు మాట్లాడుతూ, చంద్రబాబు, దేవినేని ఉమలపై కొడాలి నాని అనుచిత వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా... రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోందని చెప్పారు. ప్రశ్నించే వారిపై భౌతికదాడులకు పాల్పడుతున్నారని అన్నారు. రానున్న రోజుల్లో జగన్ అరాచకపాలనపై ప్రజలు తిరగబడతారని చెప్పారు.

Devineni Uma
Telugudesam
Kodali Nani
Vallabhaneni Vamsi
YSRCP
Police Complaint

More Telugu News